Friday 14 December 2012




వెలుగు నీడల 'ముసురు':పెద్ది భొట్ల కథ

 ఖాదర్ మొహియుద్దీన్


 బాధకవిత్వానికి పర్యాయ పదం అన్నాడు శ్రీశ్రీ. కవిత్వానికే కాదు కథలకు కూడా అదే పర్యాయపదం. పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథల విషయంలో ఇది మరింత నిజం. జీవితంలోని వివిధ కోణాల్లో దాగివుండే దారుణమైన విషాదాలు సుబ్బరామయ్య కథానికలకు ముడి పదార్థాలు.

దాదాపు అయిదారు దశాబ్దాలుగా రచనా రంగంలో కృషి చేస్తున్న సుబ్బరామయ్య ఒక పసిపిల్లవాడి కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూశారు. వైరుధ్యాల మధ్య సామంజస్యాన్ని ఒక జిజ్ఞాసిగా పరిశీలించారు. స్వాతంత్య్రానంతర కాలంలో తెలుగు జీవితంలో ఏర్పడిన వివిధ వైపరీత్యాలను అర్థం చేసుకున్నారు. ఫ్యూడలిజం నశించి దాని అవశేషాల నుండి పెట్టుబడిదారీ సమాజం ఆవిర్భవిస్తూన్న సందర్భంలో ఏర్పడుతూన్న పరిణామాలను ప్రతిభావంతంగా చిత్రించారు. ఈ చారిత్రక పరిణామం ఆస్తిపరులలోనే కాదు అల్పజీవుల బతుకుల్లో తెచ్చిన మార్పుని సైతం గుర్తించారు. సామాజిక జీవితంలో ఏర్పడిన ఖాళీలను సృజనాత్మకంగా పూరించే ప్రయత్నం చేశారు. ఈ యాభైయేళ్ళ కాలంలో ఆయన తనదైన ఒక బలమైన పాఠక లోకాన్ని సృష్టించుకున్నారు. రచయితగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సుబ్బరామయ్య కథలను పరామర్శించటానికి ముందు ఆయన రచనల గురించి పలువురు కవులు, రచయితలు, ఆలోచనాపరులు ప్రతిస్పందించిన తీరును పరిశీలించటం సముచితం.

జీవన బీభత్సాన్ని అసాధారణంగా చిత్రించిన కథాశిల్పి అని దశాబ్దాల క్రితం ప్రశంసించారు పురాణం సుబ్రహ్మణ్యశర్మ.
జీవితంలోని విషాదాన్ని తప్ప ఉత్సవ వైభవం కేసి కన్నెత్తి చూడని కథారచయిత సుబ్బరామయ్య అన్నారు భమిడిపాటి జగన్నాథరావు.
దుఃఖార్తులు, శ్రమార్తులు, శోకార్తులు, అనాధలు, అభాగ్యుల సామూహిక విషాద గానానికి బాణీలు కట్టిన సంగీత దర్శకుడు.. లోకంలో చరిత్ర హీనుల పదయాత్రకు ప్లకార్డులు రాసి పెడుతూన్న పేవ్‌మెంట్ చిత్రకారుడు.. గోర్కీ లోయర్ డెప్త్స్‌లో లూకా లాగా తన వేదాంత ప్రవచనాలతో ఈ బీభత్స లోకానికి శాంతిని ప్రసాదిస్తున్న రష్యన్ పౌరుడి రెండవ శరీరధారి.. అంతఃకరణే ధనుస్సుగా, దాని విన్యాసమే అభివ్యక్తీకరణగా కథలల్లిన మహా కథకుడు అన్నారు మునిపల్లె రాజు. దళిత బ్రాహ్మణుల చరిత్రకారుడు.. ఇది వేగుంట మోహనప్రసాద్ వ్యాఖ్య. బాల్యం పారేసుకున్న భవభూతి భ్రాత.. అని అభివర్ణించారు కప్పగంతుల మల్లిఖార్జునరావు. విమర్శనాత్మక వాస్తవికవాది.. కథానికా సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన ముద్ర.. సాధారణంగా ఎవరూ గమనించని విభిన్న జీవన పార్శ్వాలను ఒక అనుకంపతో ఆవిష్కరించిన కథా సృజనకారుడు అన్నారు కేతు విశ్వనాథరెడ్డి.

తెలుగు కథా సాహిత్యంలో అక్షరాల ఆజానుబాహుడు.. గొగోల్ 'డెడ్ సోల్స్'లో హీరో.. పాన్ ద్రవిడియన్ కథలు రాసినవాడు.. తెలుగు బతుక్కి తెలియని ఒక పార్శ్వానికి తెర ఎత్తినవాడు.. ఇది ఉపేంద్ర వర్ణన. నిరాడంబర దీపధారి.. కొండంత వెలుగునిచ్చే కథా దీపాలను వెలిగించినాడు.. ఇది విహారి ప్రశంస.
ఏడుపుగొట్టు కథలు అని విమర్శించినవారూ లేకపోలేదు.
వాస్తవానికి ఇవన్నీ పాక్షిక సత్యాలే. అయితే ఈ స్పందనలన్నింటినీ ఒకచోటికి చేర్చినప్పుడు, ఆ పాక్షిక దృశ్య శకలాల్లోంచి లీలగానైనా సరే పెద్దిభొట్ల సాహితీ మూర్తిత్వం మనముందు సాక్షాత్కరిస్తోంది.
స్వాతంత్య్రానికి పూర్వం ఈనాటి ప్రకాశం జిల్లాలో పుట్టిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కర్మక్షేత్రం, కార్యరంగం రెండూ విజయవాడ నగరమే. మృత్యువు ఆయన కథలో తరచుగా తారసిల్లుతుందనటం వాస్తవమే. అయితే అది మాత్రమే పూర్తి వాస్తవం కాదు. మృత్యువును అధిగమించటం కోసం నిర్భాగ్యులు, నిస్సహాయులు నిరంతరం చేసే ఆరాట పోరాటాలు పెద్దిభొట్ల కథల్లో పుష్కలం. అంతులేని అననుకూలతల మధ్య, క్షణ క్షణ బీభత్సాల మధ్య, నిరాశా నిస్పృహల మధ్య, దైన్యాలు హైన్యాల మధ్య, ఘోరాల మధ్య కూడా ఎంతో అలవోకగా ఒదిగిపోయి జీవించటానికి అలవాటు పడిన మనుషులకు ఈ కథలు శాశ్వత స్థావరం. పాఠకులను విషాదంలో ముంచెత్తటం ఈ కథల అంతిమ లక్ష్యం కాదు. విషాదాలను అధిగమింపజేసేందుకు ప్రేరేపించటం వీటి వెనుక దాగివున్న ఆదర్శం. సనాతన వృత్తులు, సంప్రదాయాల తాలూకు విషాదాన్ని చిత్రించటంలో కూడా వాటిని అధిగమింపజేసే ప్రయత్నమే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

సుబ్బరామయ్య కథానికల్ని లిరిక్స్‌తో పోల్చవచ్చు. ఇవి కేవలం కథలు మాత్రమే కాదు, కావ్యాలు కూడా. రూపంలో ఇవి కథానికలు. సారంలో కావ్య ఖండికలు. ఇది మనతో మాట్లాడే వచనం. మౌఖిక, లిఖిత సంప్రదాయాల సృజనాత్మక సమ్మేళనం. సుబ్బరామయ్య మాటల మంత్రగాడు. అనూహ్యంగా ఒక్క ఉదుటున లక్ష్యాన్ని ఛేదించేందుకు చేసే దాడుల్లాంటివి సుబ్బరామయ్య కథలు. కథానికా రచనలో ఆయనది గెరిల్లా యుద్ధ నీతి. వారి కథా సంవిధానం దాదాపుగా బుల్ ఫైటింగ్‌తో సరిసమానం. అల్పజీవుల ఆత్మల కదలికల్ని వీక్షించే నిఘానేత్రం సుబ్బరామయ్య కథాక్షేత్రం.

ఏదో ఒక సంఘటనో, ఏదో ఒక వస్తువో రచయిత అంతరంగాన్ని స్పృశించి, ఉర్రూతలూపి, ఆవహించి, సొంత అనుభవంగా మారిపోయి, తనదైన ప్రత్యేకమైన భాషలో లిరిక్‌లా అభివ్యక్తిని అందుకోవటం సుబ్బరామయ్య కథల్లో కొట్టొచ్చినట్లు కనిపించే విశేషం. అక్షరాలు, పదాలు, వాక్యాలు పరస్పరం పెనవేసుకుపోతాయి. లయ చెడకుండా, స్వరం తప్పకుండా, అపశ్రుతి దొర్లకుండా ఒకే బొంది, ఒకే ప్రాణం, ఒకే గొంతు అన్నట్లుగా ప్రతిధ్వనిస్తాయి. ఇవన్నీ నూటికి నూరుపాళ్ళూ లిరిక్ లక్షణాలే. ఘనీభవించిన అసంతృప్తి సుబ్బరామయ్య ప్రధాన ఇతివృత్తం.

మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మనుషులు, నిరుపేదలు, అల్పజీవులు సుబ్బరామయ్య పాత్రలు. సేతురామన్, పంకజవల్లి, సింగారవేలు, పెరియనాయకి, సావిత్రి, వరాలు, కొళందవేలు, తిరుపతి, కుమారస్వామి వంటివి ఆయన సృష్టించిన పాత్రల పేర్లు. కేవలం మనుషులు మాత్రమే కాదు వివిధ రూపాల్లో కనిపించే ఎండలు, వానలు, మబ్బులు, కలలు కూడా సుబ్బరామయ్య కథల్లో రక్తి కట్టించటంలో ప్రధాన పాత్రలే. ఒక విషాద బీభత్స వాతావరణాన్ని సృష్టించటంలో వీటి పాత్ర ఎంతో కీలకం. సుబ్బరామయ్య కథలు పాఠకులకు జ్ఞానబోధ చేయవు. ఆయన కథలకు కేవలం అనుభవాలతోనే సంబంధం. అనుభవాలకు ప్రతిరూపాలు ఆయన పాత్రలు. పాత్రల ద్వారా ఆయన తన అనుభవాలను ఆవిష్కరిస్తారు. ఆయన ప్రతీ అనుభవం వెనుకా ఒక ప్రపంచం దాగి ఉంటుంది. ఒక సృజనశీలిగా సుబ్బరామయ్యకి ప్రపంచంతో కాదు కేవలం తన అనుభవంతోనే ప్రమేయం. ఆయన తన అనుభవాన్ని పాత్రలు, ప్రతిమలు, ప్రతీకలద్వారా చిత్రించి, అనుభవం వెనుక దాగిఉన్న ప్రపంచాన్ని తిరిగి అదే ప్రపంచంగా కాకుండా అప్పటి వరకు మనం చూడని మరో ప్రపంచంగా చూపించి మనల్ని చకితుల్ని చేస్తారు. సాధారణంగా కథా రచయితలు తమ అనుభవాలను సాధారణీకరిస్తారు. కానీ సుబ్బరామయ్య వాటిని విశేషీకరిస్తారు.

సుబ్బరామయ్య తన కథానికల ద్వారా తెలుగు పాఠకుల ముందు ఆవిష్కరించిన ప్రపంచాలు అసంఖ్యాకం. కోదండం గారి కల, లేచిన వేళ, చింపిరి కథల ద్వారా ఆయన ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరించారు. అది రైల్వే కంపార్టుమెంటుల్ని శుభ్రం చేసి అడుక్కుతిని బతికే అనాథ పిల్లల ప్రపంచం. వాళ్ళు నలుగురు. ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. కోటిగాడు, నిప్పుకోడిగాడు, చింపిరి మగపిల్లలు. ఆడపిల్ల పేరు బుజ్జమ్మ. ఇది ఒక గ్రూపు. రైల్వే స్టేషనే వాళ్ళ ప్రపంచం. ఈ పై మూడు కథలు ఈ పాత్రల చుట్టే తిరుగుతాయి.

'కోదండం గారి కల' మనస్సును స్పర్శించే ఒక మంచి కథ. కోదండం గారు రైల్వే స్కూల్లో డ్రిల్లు మాస్టారు. ఓ రోజు ఈ నలుగురు పిల్లల గ్రూపుకు పోటీగా మరో గ్రూపు దిగుతుంది. రెండు గ్రూపుల మధ్య కొట్లాట వస్తుంది. వివాదానికి నిప్పుకోడిగాడు ఓ పరిష్కార మార్గం చూపిస్తాడు. ఒక్కొక్క గ్రూపులోంచి ఒకడ్ని ఎంపిక చేయాలి. వాళ్ళిద్దరు ద్వంద్వ యుద్ధం చేయాలి. ఓడిన గ్రూపు శాశ్వతంగా అక్కడినుంచి వెళ్ళిపోవాలి. ఇదీ ఒప్పందం. మల్లయుద్ధం మొదలవుతుంది. ఈ తతంగాన్ని ఒక పోలీసు గమనిస్తుంటాడు. పట్టుకోబోయేంతలో చాలామంది పారిపోతారు. మల్లయోధులు మాత్రం దొరికిపోతారు. దొరికిపోయిన ఇద్దరిలో నిప్పుకోడిగాడు ఒకడు.

పాసుకెళ్ళొస్తానని పోలీసుని నమ్మిస్తాడు. ఫెన్సింగ్ పక్కనే ఉన్న పొడవాటి పాత ఇనుప గొట్టం తీసుకొని అయిదారు అడుగులు వెనక్కి వచ్చి ఒక్క ఊపున ముందుకు పరిగెత్తి ఆ గొట్టం ఆధారంగా గాలిలోకి లేచి ఏడడుగులు పైన ఉన్న ఆ ఫెన్సింగ్‌ను లంఘించి అవతలివైపుకు పారిపోతాడు. ఈ దృశ్యాన్ని కోదండంగారు చూస్తాడు. ఎలాగైనా సరే వాడిని ఒలెంపిక్స్ లెవల్‌కి తీసుకువెళ్ళి ప్రపంచంలోనే పోల్‌వాల్ట్‌లో నెంబర్ వన్‌గా తయారుచేయాలని నిర్ణయించుకుంటాడు. వాడికోసం ప్రతిరోజూ స్టేషన్ అంతా గాలిస్తుంటాడు. వాళ్ళెవరూ కనిపించరు. వాళ్ళను గురించి రైల్వే ఉద్యోగుల్ని వాకబు చేస్తాడు. ఒకరోజు సురేశన్ అనే టికెట్ కలెక్టర్ నిప్పుకోడిగాడ్ని పట్టుకొని కోదండం గారి ఇంటికి తీసుకువెళతాడు. అక్కడ దృశ్యం తారుమారు అయి ఉంటుంది. కోదండంగారికి మైల్డ్ పెరాలసిస్ స్ట్రోక్. స్పృహలో ఉండడు. రాంచీలో ఉన్న వాళ్ళ పెద్దబ్బాయి వైద్యం నిమిత్తం తండ్రిని వెంట తీసుకువెళ్ళే ప్రయత్రంలో ఉన్నాడు. గంటలో ట్రైను. ఇదీ పరిస్థితి...

పూర్ణాహుతి, దుర్దినం, శుక్రవారం కథలది సనాతన వృత్తుల వ్యధల ప్రపంచం. 'పూర్ణాహుతి' శనిదానాలు, మృత్యుంజయ దానాలు గ్రహించి జీవించే ఒక బీద బ్రాహ్మడి వ్యధ.
ఆ పేద బ్రాహ్మడి కథనంలోనే చెప్పాలంటే- "పై పంచె దులిపి భుజాన వేసుకుని వెళ్ళి కూర్చున్నాను. ఆ దంపతులిద్దరూ నా కాళ్ళు కడిగి ముందు శనిదానం ఇచ్చారు. కాసిని బియ్యమూ, తిలలూ, రూపా యి బిళ్ళా.. ఒక విస్తరిలో వుంచి దానం ఇచ్చారు. నేనది గ్రహిస్తూ మనసులో 'బాబూ, మీరు పిల్లాపాపలతో వర్థిల్లాలి. మీకు సకల సంపదలూ సమకూరాలి. శని మీకు అడ్డం రాడు. శని తాలూకు వక్రదృష్టి ఏమైనా ఉంటే ఇదిగో ఈ దానంతో నాకు సంక్రమిస్తుంది.. దాన్ని నేను నెత్తిన వేసుకుంటాను' అనుకున్నాను.తరువాత వెంటనే మృత్యుంజయ దానం యిచ్చారు. కాసిని బియ్యమూ, యింత పత్తీ, నూనెలో ముంచి తీసిన ఒక యినుప మేకూ, రూపాయి నాణెం.. నేను ఆ దానం గ్రహిస్తూ మళ్ళీ 'రానివ్వండి బాబూ! మీ కుటుంబం లో ఎవరికైనాఅపమృత్యువు రాసి పెట్టి వుంటే, ఇదిగో, ఈ దానం ద్వారా దాన్ని నాకు సంక్రమింప జెయ్యండి. మీరు సుఖంగా ఉం డండి' అనుకున్నాను.''

అతను కేవలం అనుకోవటంతోనే ఆగడు. వాళ్ళందరి శనీ, అపమృత్యువూ తనను ఆవరిస్తాయని విశ్వసిస్తాడు. ఈ క్షుద్రదానాలు అందుకునే విషయంలో ఈ బస్తీలోనే అతనికి ఎవరూ పోటీ లేరు. కానీ పేరిశాస్త్రితో ఏర్పడిన పొరపొచ్చం వల్ల పోటీ వస్తుంది. పేరిశాస్త్రి ఈ పనికి రామేశం అనే యువకుడ్ని రంగంలోకి దింపుతాడు. అతనికి తిండికి కూడా గడవని దరిద్రం దాపురిస్తుంది. ఆకలి కడుపుతో నడిచి వెళుతుంటే తుప్పు పట్టిన ఒక పాత మేకు అతని కాలిలో దిగబడుతుంది. జ్వరం వస్తుంది. డాక్టరు దగ్గరికి వెళతాడు. తిరిగి వస్తుండగా రామేశం ఎదురవుతాడు. ఈ క్షుద్ర దానాలు గ్రహించే వృత్తిలోకి దిగవద్దని నానావిధాలుగా నచ్చచెపుతాడు. నాకీ ప్రపంచంలో నా అనేవాళ్ళు లేరు. నీకు తమ్ముడు ఉన్నాడు. వాడిని చదవించాలంటున్నావు. మీరిద్దరూ బతికి బట్టకట్టాలనుకుంటే ఈ వృత్తి మానుకో అంటాడు. రామేశం వినడు. అతన్నీ, అతని తమ్ముడినీ, పేరిశాస్త్రినీ తిట్టి, శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతాడు. జ్వరం తీవ్రమవుతుంది. ఒళ్ళు తెలియని స్థితి. ఎవరో వచ్చి శుశ్రూష చేస్తున్నట్టు అనిపిస్తుంది. బలవంతంగా కళ్ళుతెరిచి చూస్తే తనకు సేవ చేస్తూ ఎదురుగా రామేశం.. అదే రోజు జరిగిన రోడ్డు ఏక్సిడెంట్‌లో రామేశం చచ్చిపోతాడు. అంత జ్వరంలోనూ ప్రమాద స్థలానికి వెళ్ళి, నీ తమ్ముడి చదువు బాధ్యతను నేను తీసుకుంటానని మనసులో అనుకుంటాడు- కథలో ప్రథమ పురుషలో తారసిల్లే ఈ బీద బ్రాహ్మడు.

కోరిక, కళ్ళజోడు కథలు ఆవిష్కరించే ప్రపంచం మరో రకం. అల్పజీవుల స్వల్పమైన కోర్కెల చుట్టూ అలుముకుని వుండే విషాదం వీటిలో ప్రధానాంశం.
చీకటి, సతీసావిత్రి, సెక్స్ వర్కర్స్ ప్రపంచాలు. నిప్పుకోడి, ఏస్‌రన్నర్ వంటివి పలు ప్రపంచాల సమాహారం. వరల్డ్ ఛాంపియన్‌గా ఖ్యాతి గడించిన గామా పహిల్వాన్ తన చివరి రోజుల్లో తిండికి గడవక చనిపోయాడని తెలిసి ఆయన 'నిప్పుకోడి' కథ రాశాడు. ఏస్‌రన్నర్ కూడా డిటో డిటో.. దగ్ధగీతం రచన వెనుక కూడా వాస్తవ జీవితాలు ఉన్నాయి.

సుబ్బరామయ్య కథల్లో కేవలం ఆఖ్యానాలు మాత్రమే కాదు. ఉపాఖ్యానాలూ ఉంటాయి. ఈ ఉపాఖ్యానాలన్నీ దాదాపు విషాద ప్రేమ గాథలే. పూర్ణాహుతి, ముసురు, దగ్ధగీతం, సతీసావిత్రివంటి అనేక కథలు ఇందుకు సజీవ నిదర్శనాలు. ఈ యాభయ్యేళ్ళ కాలంలో ఆయన మహా అయితే ఓ వంద పై చిలుకు కథలు రాసి ఉంటారు. కానీ అన్ని కథలు విస్మరించటానికి వీల్లేనివే కావటం విశేషం. నీళ్ళు, చీకటి, ముసురు, నిప్పుకోడి, పూర్ణాహుతి, గాలి, కళ్లజోడు, అలజడి, సతీసావిత్రి, దుర్దినం, కోరిక, ఏస్‌రన్నర్, దగ్ధగీతం, శుక్రవారం, కొళందవేలు బొమ్మ, చిలిపితనం, చుక్కమ్మకథ, లేచినవేళ, కోదండంగారి కల, చింపిరి, చిలకహంస, పీట, ఇంగువ, తాతిగాడి చొక్కా, మరో వీధి పాప- ఇవన్నీ నిస్సందేహంగా అంతర్జాతీయ వేదికపై సగర్వంగా నిలబడగలిగిన కథలు. తెలుగుతోపాటు భారతీయ కథానికా సాహిత్యానికి సయితం ప్రాతినిధ్యం వహించగల సత్తా ఉన్న కథలు. తన 75వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న సుబ్బరామయ్యకు నా ప్రేమపూర్వక ముబారక్!


Monday 8 October 2012

మరణోత్సవం



మరణోత్సవం


అరబీ మూలం: అడోనిస్



వెనకాతల్నుంచే వస్తుంది మృత్యువు

తీరా అది మన ముందుకువచ్చి

నిలబడినప్పుడు కూడా



తలపడేది కేవలం జీవితమే


కళ్ళు ఒక రహదారి

రహదారి ఒక చౌ రస్తా 


ఒక పసివాడు 

ఆడుకుంటాడు జీవితంతో 

ఒక ముసలివాడు 

సాగిపోతుంటాడు దాని సాయంతో 


అతిగా మాట్లాడితే తుప్పు పడుతుంది నోట్లో 

యెండిపోతాయి కళ్ళు కలల లేమితో 


ముడుతలు -

ముఖం మీది కాల్వలు,

గుండె లోపలి గోతులు.



ఒక దేహం -

సగం వాకిలి,

సగం వంగిపోవటం.


ఒక ఒంటి రెక్క 

సీతాకోక చిలుక  దాని శిరస్సు.


మృత్యువు నిన్ను రాసేసినపుడు 

చదివేస్తుంది నిన్ను ఆకాశం 


ఆకాశానికి రెండు స్తనాలు,

అందరూ గ్రోలేది అందులోంచే 

ప్రతీ క్షణం,ప్రతీ చోటా.


మనిషి ఒక పుస్తకం 

జీవితం పఠిస్తుంది దాన్ని నిరంతరం

హఠాత్తుగా చదువుతుంది మృత్యువు 

ఒక్కసారే కేవలం.   

------------
సాహితి , ఆంధ్రభూమి , సోమవారం 8 అక్టోబర్ 2012

Thursday 5 July 2012

ఒక జాపనీయ కవిత



ఒక జాపనీయ కవిత 


పసుపు పచ్చని పక్షుల ల్యాండ్ స్కేప్

షుంతారో తనికావా 



పక్షులున్నాయి

కాబట్టి ఆకాశం వుంది

ఆకాశం వుంది

కాబట్టి బెలూన్లు వున్నాయి

బెలూన్లు వున్నాయి 

కాబట్టి పిల్లలు పరుగులు తీస్తున్నారు 

పిల్లలు పరుగులు తీస్తున్నారు

కాబట్టి నవ్వులు వున్నాయి 

నవ్వులు వున్నాయి

కాబట్టి విషాదం వుంది 

విషాదం వుంది

కాబట్టి ప్రార్థన వుంది

మోకరిల్లేందుకు నేల వుంది

నేల వుంది

కాబట్టి నీరు ప్రవహిస్తుంది

నేడు వుంది, రేపు వుంది

ఒక పసుపు పచ్చని పక్షి వుంది

కాబట్టి సమస్తమయిన రంగులు, రూపాలు,

చలనాల ప్రపంచం వుంది




షుంతారో తనికావా 





Friday 29 June 2012

స్మైలూ - గాలీ

గాలి నాసరరెడ్డి, స్మైల్, ఖాదర్ మొహియుద్దీన్ 




స్మైలూ - గాలీ


ఇది ప్రఖ్యాత రచయితా, కవీ స్మైల్ మరో ప్రముఖ తెలుగు కవి గాలి నాసరరెడ్డికి రాసిన ఉత్తరం. 

మన ముందు తరం పాటించిన విలువలను మనం మరిచిపోకూడదని ఈ ప్రయత్నం. 

అంతే కాదు. ప్రముఖుల ఉత్తరాలను భద్రపరచాలనేది మా  సంకల్పం.   

ఉత్తరాన్నీ, ఫొటోనీ పంపించినందుకు నాసరరెడ్డికి కృతజ్ఞతలు. 







మై డియర్ నాసరరెడ్డీ,

ఎన్నేళ్ళైంది మనం కబుర్లు చెప్పుకొని? అసలు, జ్ఞాపకం వున్నానా నేను?

అటూ యిటూ అయిపోయాం హైద్రాబాద్ వొదిలిన తర్వాత. ఎలా వున్నారూ?

నేను రిటైరై మొన్న ఫిబ్రవరికి రెండేళ్ళు. హాయిగా

పుస్తకాలు చదువుకుంటూ మీలాంటి మిత్రులెవరన్నా కలిస్తే ఓ కాస్తసేపు 

ఆల్కొహాల్ మీద ఆత్మస్తుతీ పరనిందా! ( పరులనగా గవర్నమెంటు

గాడిదలనుకోండి.) ఇది పోనీండి. మనం కలుసుకుందాం.15,06 న.

దీంతోవున్న ' చెట్టంత కవికి పిట్టంత సత్కారం ' చదవండి.సంగతి 

తెలుస్తుంది. ఓ. కే. మీరు తప్పకుండా రావాలి. పోతే సావెనీర్ కి 

ఏదన్నా రాసి పెందరాడే పంపగలరా? ప్రెస్ కివ్వాలి కదా.

ఖాదర్ వుండుండి వేళకాని వేళల్లో వురుముతుంటాడు. అంతే.

అతన్ని కలిసీ ఎన్నో యేళ్ళైపోయింది. గోదావరికి మూడో వంతెన పడింది.

కొత్త నీరూ ఎంతో ప్రవహించింది... కలిసినప్పుడు అన్నీ కబుర్లే. రైట్.

వీలైతే ఓ ఉత్తరం. చూస్తుంటా.

శుభాకాంక్షలతో

ఇస్మాయిల్





అమ్మకొంగు










 ఇది నెక్కలపూడి ఉషారాణి కవిత. అమ్మపాదం కవితాసంకలనం లో అచ్చయిన ' అమ్మకొంగు ' అనే ఈ కవితకు 

అరుదయిన గౌరవం లభించింది.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తోపాటు భారత  ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ, 

జాతీయ గ్రామీణ హెల్త్ మిషన్, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ,యునిసెఫ్ సం యుక్తంగా చేపట్టిన    తల్లీపిల్లల 

ఆరోగ్యపరక్షణ కార్యక్రమానికి ఈ కవితను కాన్సెప్ట్ గీతం గా గుర్తించారు. కార్యక్రమం ప్రారభోత్సవం సందర్భంగా 

కవయిత్రి నెక్కలపూడి ఉషారాణినిసత్కరించారు.





అమ్మకొంగు


నెక్కలపూడి ఉషారాణి



బుడి బుడి నడకల ఆదిమ ఆలంబనం అమ్మ పైటకొంగు

అపరిచితుల పలకరింపులకు సిగ్గుల పరదా

దాగుడుమూతల దెబ్బలాటల్లో నా రక్షణదుర్గం

ఆటల అలసటల చెమటలు తుడిచే తువ్వాలు 

కంట్లో నలకకు ఊర్పులకాపు అమ్మ పైటకొంగు


చిరుతిండాకలికి తాయిలం భరిణె

జీడీలకు డబ్బులు దొరికే అక్షయపాత్ర

అర్థరాత్రి చలిలో నులివెచ్చని భోగిమంట 

మధ్యాహ్నపు మండుటెండలో మమతల గొడుగు 

దిగజారిన జ్వెరం చెమటలకు సంజీవనీ స్పర్శ 

నావను దరిజేర్చే తెరచాప అమ్మ పైటకొంగు

రోజులో అమ్మకెన్ని పనులో అమ్మకొంగుకు అన్ని రూపాలు!

నిత్యం గ్నాపకాలలో వేలాడే అమ్మకొంగులో

ఎప్పటికీ నేను పసిబొమ్మనే!!







కాఫ్కా - శ్రీశ్రీ

    


వింత జంతువు 

మూలం: ఫ్రాంజ్ కాఫ్కా

అనువాదం: మహాకవి శ్రీశ్రీ  




నా దగ్గర ఒక వింత జంతువుంది. సగం పిల్లి, సగం గొర్రె, చచ్చిపోతూ మా నాన్న వదిలిన ఆస్తి.  

అయితే దాని ప్రస్తుత  రూపం నా కాలం లోనే  ఏర్పడింది. అంతకుపూర్వం అది పిల్లిగాకాక 

చాలామట్టుకు గొర్రెగానే  ఉండేది. పిల్లిజాతి నుండి   తలా, గోళ్ళూ గొర్రె జాతినుండి ఒడ్డూ, 

పొడుగూ,  ఆకారమూ దానికి సంక్రమించాయి.  రెండిటినుంచీ కళ్ళు భీకరంగా, ఎప్పటి

కప్పుడు మారిపోతూ, బొచ్చు మెత్తగా, చర్మానికి దగ్గరగా గమనం  దాట్లు వెయ్యడం, ప్రాకడం, 

కిటికీమీద ఎండలో కూర్చుని అది బంతిలాగ ముడుచుకుపోయి గుర్రు పెడుతుంది.  పచ్చిక 

బయలులో పిచ్చెత్తినట్టు గంతులు వేస్తూ ఒకంతకీ దొరకదు. పిల్లలనుచూస్తే పారిపోతుంది;

గొర్రెల మీద తిరగబడుతుంది. వెన్నెల రాత్రులలో ఇంటి పైకప్పు మీద  సంచరించడం దానికి

 సరదా.   అది మ్యావు మననే లేదు. ఎలకలంటే అసహ్యం. కోళ్ళ   తట్ట దగ్గర గంటలకొద్దీ

 మాటు వేస్తుంది. కాని యెప్పుడు   ఒక్క కోడిని కూడా చంపలేదు. 


దానికి నేను పాలుపోస్తూ ఉంటాను. క్రూరమృగం వలె దంతాల సందులనుంచి పెద్ద పెద్ద పీల్పులతో 

పాలు తాగుతుంది. అదంటే   చిన్నపిల్లల కందరికీ గొప్ప వేడుక అని వేరే చెప్పనక్కరలేదు. 

ఆదివారం అందరూ వచ్చేపూట మోకాళ్ళ మీద ఆ జంతువును పెట్టుకుని  కూర్చుంటాను.

 గ్రామం లోని పిల్లలందరూ నా చుట్టూ   నిలుచుంటారు.  పిల్లలంతా వింత వింత వింత ప్రశ్నలు 

వేస్తారు. మానవ మాత్రులెవ్వరూ   వాటికి జవాబులు చెప్పలేరు. ప్రపంచం లో  ఇలాంటి

 జంతువు ఒక్కటే ఎందుకుండాలి? ఇది చచ్చిపోతే   ఏమవుతుంది? దీనికి ఒంటరితనం   అనిపించదా? 

పిల్లల్నెందుకు పెట్టలేదు? దీని పేరేమిటి? ఇట్టివే ఎన్నో ప్రశ్నలు.



జవాబు లివ్వడానికి నేను ప్రయత్నించను. జంతువును ఒళ్ళో పెట్టుకుని అలాగే కూర్చుంటాను. 

పిల్ల లొక్కొక్కప్పుడు తమతో పిల్లులను  తెస్తారు. ఒకసారి రెండు గొర్రెల్ని కూడా తెచ్చారు. కాని   

వారనుకున్నదానికి   విరుద్ధంగా నా జంతువు బంధువులను గుర్తించలేక పోయింది.  జంతువులు 

తమ మృగాల కళ్ళతో పరస్పరం  తేరిపార చూసుకున్నాయి. ఎవరి బతుకు వాళ్ళదే అనుకున్నాయి. 

నా వొళ్ళో కూర్చున్నప్పుడు జంతువుకి భయం గాని, వేటాడే ఉత్సాహం గాని ఉండవు. నన్ను    అదుము

కున్నప్పుడు దానికెక్కడలేని సంతోషమూ వస్తుంది. తాను  ఎవరిమధ్య పెరిగిందో ఆ కుటుంబం పట్ల   

ఎప్పుడూ విశ్వాసం గా ఉంటుంది. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు.  లోకం  లో తనకు సవతి బంధువు

లెవరూ   లేకపోవటం వల్ల ఈ జంతువు మా ఇంటినే కనిపెట్టుకొని ఉంటుంది.ఇక్కడ  దానికి దొరికిన 

  ఆశ్రయాన్ని పవిత్రంగా   చూసుకొంటుంది.



ఒక్కొకప్పుడీ జంతువు నా చుట్టూ చూస్తూ నా కాళ్ళని చుట్టుకుంటూ ఎప్పటికీ నన్ను వదలకపోతే నవ్వక

తప్పేది కాదు. గొర్రెగానూ,  పిల్లిగానూ ఉన్నది చాలక కుక్కగా కూడా ఉండాలనుకుంటుంది. అందరివలెనే

నాకు కూడా  అప్పుడప్పుడు వ్యవహారపు చిక్కులు తటస్థపడి,  ఏమవుతుందో ఏమిటో అనే ఆందోళనలో

 నేను పడిపోయి  అప్పటికీ తెగించుకొని వాలుకుర్చీలో కూర్చున్న సమయం లో ఈ జంతువు నా

వొళ్ళోనే వుంటుంది. దానివైపు చూస్తే పొడుగాటి దాని మీసాల నుంచి కన్నీళ్ళు నావా? దానివా? 

నిజంగా ఈ పిల్లికి గొర్రెల ఆత్మతోపాటు మనుష్యుల ఆశయాలు కూడా ఉన్నాయేమో? మా నాన్న 

నాకు వదలిపెట్టిన ఆస్తి స్వల్పమేగాని ఈ ఆస్తి  అంత కొట్టివేయదగ్గది కాదు.



గొర్రెల్లోనూ, పిల్లుల్లోనూ కనబడే ఆరాటం, వేరు వేరు రకాలదే అయినా ఈ జంతువులలోనూ ఉంది. 

అందుచేత దీని  చర్మం దీనికి  చాలనట్లుంటుంది. ఒక్కొక్కప్పుడీ జంతువు నా పక్కని కుర్చీ మీదికి

 ఉరికి, తన ముందుకాళ్ళు నా  భుజాలమీద వేసి నా చెవి దగ్గర తన   ముట్టె చేర్చుతుంది - అచ్చంగా

 నాతో ఏదో ఏవో మాట్లాడ దలచుకున్నట్టే  నిజంగా ఆ తరువాత తన తల తిప్పి నా మొగం వైపు   

చూస్తుంది. తాను చెప్పింది నేను బోధపరచుకొన్నానో లేదో  చూడడానికి, దాన్ని సంతోషపెట్టడానికి 

గాను నేను కూడా అర్థమయిందన్నట్లుగా నటించి తల ఆడిస్తాను. అప్పుడది నేలమీది కురికి 

సరదాగా ఇల్లంతా నాట్యం చేస్తుంది.



బహుశా ఈ జంతువుకి కసాయివాడి కత్తివల్ల విముక్తి కలుగుతుందేమో! కాని ఇది నా పూర్వుల ఆస్తి 

కాబట్టి ఇట్టి  పని చెయ్యకూడదు.   అంచేత దానంత అదే ఊపిరి వదిలి వేసే అదను వచ్చేదాకా

 వేచుకొని ఉండవలసిందే. అయినా  అప్పుడప్పుడీ జంతువు మనుష్యజ్ఞానం తో   నావైపు చూసి 

ఇద్దరం ఒకేసారిగా దేన్ని గురించి ఆలోచిస్తున్నామో  యేదీ ఆ పని చేసి చూడు అన్నట్టుగా మొగం

 పెడుతోంది.     



Wednesday 27 June 2012

మెహది హసన్, ఒక సాయంకాలం....


మెహది హసన్, నూర్జహాన్, ఒక సాయంకాలం....




అది  ఒక అద్భుతమయిన సాయంకాలం....

గంధర్వగాయకుడు మెహది హసన్ కచేరీ....

స్వరసామ్రాజ్యం లో మకుటం లేని మహారాణి నూర్జహాన్ ముఖ్య అతిధిగా పాల్గొన్న అపూర్వ సందర్భం అది. 

సభాప్రాంగణమంతా సంగీత ప్రేమికులతో  నిండిపోయివుంది. 

నూర్జహాన్ ను సాదరంగా వేదిక మీదికి ఆహ్వానించారు.

 ఆహూతు లందరూ కరతాళ ధ్వనులతో ఆమెకు ఘనస్వాగతం పలికారు. 

విలువ కట్టలేని ప్రజల ప్రేమేమాభిమానాలకు ఆమె ముగ్ధులయారు.

వేదిక మీదికి రావటం తోనే ఆమె 'ఈ రోజు మన అందరికీ ఎంతో శుభదినం' అంటూ తన ప్రసంగం ప్రారంభించారు.

' మెహది హసన్ ను పరిచయం చేయడటమంటే సూర్యుడికి దివ్వె చూపించడం వంటిది.

 మనం అందరం ఎంతో అదృష్టవంతులం.

మనమందరం ఈ రోజు  మెహది హసన్ స్వరమాధుర్యాన్ని ఆస్వాదించబోతున్నాం.

 ఈ సభలో పాల్గొనటం నిజంగా నా అదృష్టం.

తలిదండ్రులు చేసిన దానాలను బట్టి సంతానం కలుగుతుందని అంటారు. 

మెహది హసన్ తలిదండ్రులు, తాతముత్తాతలు రత్నాలను దానం చేసి వుంటారు.

 అందువల్లనే మెహది హసన్ వంటి గంధర్వ గాయకుడు పుట్టాడు. 

నిజానికి    మానవమాత్రుడయినవాడు ఇలా పాడలేడు.

 మెహది హసన్ ని ప్రత్యక్షంగా చూసిన తరువాతనే గాని నేను ఈ వాస్తవాన్ని నమ్మలేదు. ' 

మేడం నూర్జహాన్ పసంగం అలా సాగిపోతూ వుంది. 

శ్రోతలు మంత్రముగ్ధులయి వింటున్నారు.

గజల్ సమ్రాట్ మెహది హసన్ మేడం దగ్గరికి వచ్చాడు. 

ఆమె అమితమయిన వాత్సల్యం తో అతనిని అక్కున చేర్చుకుంది.

ఒకసారి మైకు తనకివ్వమని ఆమెను అభ్యర్ధించాదు. 

ఆమె ససేమిరా అన్నది. 

మెహది హసన్ బతిమిలాడాడు.

ఆమె ఒప్పుకోలేదు.

చివరికి గత్యంతరం లెక ఆమె చేతి మైకు బలవంతంగా లాక్కున్నాదు మెహది హసన్.

జనం లొ ఆనందం....అంతు లేని ఆసక్తి...అంతుపట్టని ఉత్కంఠ...

' మేడం మాటల్ని ఆమె పెద్ద మనసుకు తార్కాణాలుగా తీసుకోవాలి. 

మేడం ప్రశంసలకు నేను ఏమాత్రం   అర్హుణ్ణి కాను. 

నేను ఒక క్లాసికల్ సంగీత కుటుంబం నుంచి వచ్చినవాణ్ణి. 

సినిమా పాటల గురించి నాకు   నిజంగా ఏమీ తెలియదు.

 మేడం నన్ను తీర్చిదిద్దారు.  

సినిమా రంగం లో నేను విజయం సాధిచానంటే అది కేవలం మేడం చలవే '

అని మెహది హసన్ తిరిగి మైకు ఆమె చేతికిచ్చాడు.

( ఆసక్తి వున్నవాళ్ళు వీడియో క్లిప్పింగ్ వీక్షించవచ్చు )  






Melody Queen Madam Noorjehan's tribute to The Ghazal Legend Mehdi Hassan

Saturday 23 June 2012

వేస్ట్ ల్యాండ్ - 7







వేస్ట్ ల్యాండ్ - 7





చవిటిపర్ర


టి.యస్.ఎలియట్


5


ఏమన్నది ఉరుము?




చెమటలు కారుతూన్న ముఖాలమీద ఎర్రని కాగడాల వెలుగుల తరువాత 

తోటలనిండా మంచులా ఘనీభవించిన మౌనం తరువాత 

రాతి మైదానాల నిండా పరివ్యాప్తమయిన ఆవేదన తరువాత

కేకలు పెడబొబ్బలు ఆర్తరావాలు ఆర్తనాదాలు కారాగారాలు భవంతులు 

దూరంగా కొండలమీద వసంతమేఘ గర్జనల ప్రతిధ్వనుల తరువాత 

బతికివున్నవాడు ఇప్పుడు చచ్చిపోయాడు 

అపుడెపుడో బతికివున్న మనం ఇపుడు చస్తూనే వున్నాం 

కాకుంటే కాసింత సహనం తో  


ఇక్కడ నీళ్ళు లేవు కేవలం గండశిలలు

గండశిలలే గాని నీళ్ళు లేవు ఇసుకదారి 

రాళ్ళు తప్ప నీళ్ళు లేని కొండల్ని చుడుతూన్న దారి

నీళ్ళే గనక వుంటే అక్కడ మనం తప్పక ఆగుతాం తాగుతాం

ఎవడయినా సరే రాళ్ళ మధ్య ఆగలేడు ఆలోచన చేయలేడు 

ఆరిన చెమటా ఇసుకలో పాదాలు

ఈ రాళ్ళ మధ్య నిజంగా వుండుంటే గనక నీళ్ళు 

ఉమ్మలేదు నిష్ప్రాణపు పళ్ళులేని పర్వతాల బోసినోరు

నుంచోలేరు నడుం వాల్చలేరు కూర్చోలేరు ఎవరూ ఇక్కడ 

కనీసం ఈ కొండల్లో కనిపించదు నిశ్శబ్దపు జాడ 

గర్జించే గొడ్డుబోతు మబ్బుదప్ప వాన లేదు 

ఏకాంతానికయిన ఈ కొండల్లో ఏమాత్రం తావు లేదు 

తపిస్తూ దహిస్తూ గుర్రుమంటూ వెక్కిరిస్తూ 

నెర్రెలిచ్చే ఇళ్ళ తలుపుల్లోంచి తొంగిచూసే వదనాలు


అక్కడ అదే గనక 

రాళ్ళ బదులు నీళ్ళుంటే 

అదే గనక అక్కడ 

రాళ్ళుండీ నీళ్ళుంటే 

నీళ్ళు

ఒక చల్లని చెలిమ

రాళ్ళమధ్య ఒక్క నీళ్ళ కొలను

కేవలం ఒకేఒక్క సెలయేటి గలగల

కిర్రుమనే కీటక శబ్దాలు వద్దు

ఎండిన గడ్డిపరకల గరగరలు వద్దు

కేవలం రాళ్ళమీంచి జారిపడే జలపాతం ధ్వనిలాగా 

పరిత్యాగి పక్షి ఒకటి అందుకుంటుంది పాట 

డ్రిప్ డ్రాప్ డ్రిప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ 

అవును సరే మరి నీళ్ళేవీ?



నిరంతరం నీడలా నీ వెంట నడిచే ఆ మూడోవాడు ఎవడు?

లెక్క చూస్తే ఇద్దరం, ఒకటి నువ్వు రెండు నేను

కానీ, తెల్లని ఈ రోడ్డు మీంచి చూపు పైకి చాపిన ప్రతిసారీ 

నీ పక్కనే నిరంతరం నడుస్తూన్న మరో మనిషి

అలికిడిలేని అడుగులు జేగురు రంగు ముసుగులో 

అంతు పట్టదు ఎంతకీ మగవాడో మరి ఆడదో?

ఉన్నది నీకావలివైపున ఇంతకీ ఎవరు చెప్పు?

గాలిమీంచి వినిపించే ఈ శబ్దం ఏమిటి?

ఇది ఎవరో ఒక మాతృమూర్తి విషాద రోదన గీతం 

చూపులు సారించినంతమేరా వ్యాపించిన మైదానాల్లోంచి 

నెర్రెలిచ్చిన నేలమీద ఎదురుదెబ్బల ఊదారంగు గాయాల్తో 

గుంపులు గుంపులుగా ముసుగులు ధరించి వస్తూన్న వీళ్ళంతా ఎవరు?


ఇంతకీ కొండల కవతలి వొడ్డునవున్న ఈ నగరం పేరేమిటి?

పగుళ్ళు, మరమ్మతులు, వయొలెట్ వాతావరణపు విస్ఫోటనాలు

కూలుతూన్న శిఖరాలు

జెరూసలేం ఏథెన్స్ అలెగ్జాండ్రియా

వియన్నా లండన్

సమస్తం అవాస్తవం 



నిడుపాటి నల్లని కురుల్ని తంత్రుల్లా సవరించి బిగించి 

గుసగుసల సంగీతాన్ని శృతి చేస్తున్నది ఒక ఆడది

అరుస్తూ, రెక్కలు అల్లార్చుతూ 

వయొలెట్ కాంతిలో గబ్బిలాలు పసిపిల్లల ముఖాల్లా 

మసిబారిన గోడమీద తలకిందులుగా పాకుతున్నాయి కిందికి 

గాల్లో అధోముఖంగా శిఖరాలు

కాలాన్ని సూచిస్తూ గడిచిన దినాల తలపోతల్ని 

గుర్తుకుతెచ్చే గంటల మోతలు

శూన్యపు జలాశయాలు,బొంద బావుల్లోంచి వినిపించే స్వరాలు



పర్వతాల మధ్య శిధిలమయిన గుహలోపల 

మసక వెన్నెల వెలుగులో చెల్లాచెదురయిన సమాధులమీంచి

ప్రార్ధనాలయం గురించి సరసరసరమని రెల్లుపాట 

శూన్య శిధిలాలయపు గాలికి అది నివాసస్థలం 

కిటికీలనేవి లేవు కేవలమొక వూగాడే ద్వారం

పొడిబారిన ఎముకలు ఎవరికీ హానిని కలిగించవు 

పైకప్పు నిట్టాడి మీద మెరుపు వెలుగులో ఒకేఒక్క కోడిపుంజు

కొక్కొరోక్కో కొక్కొరోక్కో

పిడుగుపాటు మెరుపు వెలుగు

తేమనిండిన గాలి తెమ్మెరలోంచి

వాన

ఎండిపోయింది గంగ

వాన కోసం ఎదురుచూపు జీవం లేని ఆకులు

సుదూరాన హిమగిరి పర్వత శిఖరం మీద 

కమ్ముకుంటూన్న కారుమేఘాలు

మౌనం లోకి ముడుచుకుంది మొత్తంగా అడవి

ఉరుము అన్నది

ద.

దత్త: ఇచ్చిందేముంది మనం?

మితృడా, నెత్తురు విసిరేస్తోంది నా హృదయాన్ని 

సమస్త జీవిత వివేక సంపద సయితం ఆపజాలని 

ప్రళయాంతకమైన సాహసం, లిప్తపాటు లొంగుబాటు 

దీనిమీదనే కేవలం దీనిమీదనే ఆగివుంది మన అస్తిత్వం 

మన గురించిన శ్రద్ధాంజలుల్లో ఎక్కడా దీని జాడ కనిపించదు

సాలీడు దయతో అల్లిన గ్నాపకాల గూట్లోనూ ఇది లభించదు

శూన్యం నిండిన మన గదుల్లో వకీలు గుమాస్తా 

పగులగొట్టే సీళ్ళ వీలునామా పత్రాల్లోనూ ఇది ప్రతిఫలించదు

ద. 

దయాధ్వం: నేను విన్నాను తాళం చెవిని

ద్వరం లో తిరిగిందది ఒక్కసారి,కేవలం ఒకే ఒక్కసారి

ప్రతి ఒకరూ తన చెరలో ఆలోచన తన తాళం చెవిలో 

ప్రతి ఒకరీ చెర ఖరారు తన తాళం చెవి భావనలో 

రాత్రిపూట మాత్రమే చవకబారు హత్యల పుకార్లు

విరిగిన కొరియొలేనస్ శిల్పం మనసుకు గడియసేపు మేలుకొలుపు

ద.

దమ్యత: ప్రతిస్పందించింది పడవ 

పరవశం తో,తెరచాపా తెడ్లతో తరగని అనుబంధమున్న 

అనుభవశాలి చేతి స్పర్శతో 

ప్రశాంతంగా వుంది సముద్రం

నీ హృదయమయినా అంతే 

అదుపు చేయగల చేతుల్లో పడితే 

పరవశించిపోతుంది పడవలాగే


చేపలు పడుతూ తీరం లో నేను

విస్తరిస్తూన్న ఊసరక్షేత్రం నా వెనకాతల 

సరిచేసుకోనా కనీసం నా నేలల్నయినా?



కూలిపోతోంది కూలిపోతోంది కూలిపోతోంది లండన్ బ్రిడ్జి

" సమయానికి గుర్తుకు తెచ్చుకోనా నా వ్యధ" 

అని పునీతం చేసే మంటలో పడిపోయాడతను మళ్ళీ

'ఇంతకీ నేను ఎప్పుడవుతాను వానకోకిల ని '

వానకోకిలా! ఓ వానకోకిలా!!

ప్రిన్స్ ఆక్విటీన్,అతని కూలుతూన్న కోటగోడ

ఇవి నా శిధిలాల నుంచి నేను కాపాడుకున్న శకలాలు

నిజమేనేమో నటన!

హేరోనిమోకి పిచ్చెక్కింది మళ్ళీ

దత్త.దయాధ్వం. దమ్యత.

శాంతి శాంతి శాంతి






సమాప్తం 



  

Friday 22 June 2012

చందమామను చుంబిస్తూ .....



చందమామను చుంబి స్తూ చచ్సిపోయిన వాడు....




చందమామ ప్రతిబింబాన్ని ముద్దాడబోయి మరణించిన మహాకవిని గురించి ఎపుడయినా విన్నారా? 

ఇది నిజమా  లేక కల్పనా అనేది ఇప్పుడు అప్రస్తుతం.

 ఒక జాతి సాంస్కృతిక జీవితం లో విడదీయరాని వాస్తవం గా నిలిచిపోయిన విషయం    ఇది. 

చిరస్మరణీయమయిన చైనా జానపద గాధలలో నిలిచిపోయిన ఆసక్తికమయిన ఒక వృత్తాంతం ఇది.


లి బో !  చైనా దేశానికి చెందిన ఒక మహాకవి.

 తాంగ్ యుగానికి చెందిన ఈ కవి క్రీ. శ . 701 - 762ల  మధ్య  జీవించాడు. 

చైనీయ సాహిత్య చరిత్రలో కవిత్వానికి సంబంధించినంత వరకూ అది ఒక స్వర్ణయుగం .

 కవి లి బో  దాదాపు వెయ్యికి పైగా పద్యాలు రాసాడని చరిత్ర చెబుతోంది. 

Three Hundred Tang Poems 

సంకలనం లో లి బో  కవితలు ముప్ఫయి నాలుగు వున్నాయి.


కవి లి బో   మరణం గురించి రకరకాల కథలు ప్రచారం లో వున్నాయి. 

 జీవితం లో అనేక ఆటుపోట్లు చూసిన  లి బో  మరణం చాలా సహజమయిందనే వాదనకూడా వుంది.

 కానీ అక్కడి ప్రజలు ఇవేవీ నమ్మరు.


అది ఒక వెన్నెల రాత్రి. యాంగ్ సి నది మీద పడవలో ప్రయాణం చేస్తున్నాడు లి బో.   

నీటి అలల మీద  తేలియాడుతూన్న చందమామ ప్రతిబింబం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. 

అందమయిన చందమామ  ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకుందామనిపించింది అతనికి.

పడవమీంచి ముందుకు  ఒంగాడు. 

చందమామ   ప్రతిబింబాన్ని తన పెదవులతో తాకుతున్నాననే పరవశం లో తననుతానే మరచిపోయాడు. 

అమాంతంగా   పడవమీది  నుంచి యాంగ్ సి నదిలో  పడిపోయాడు.

 చైనా జానపద గాధలో, ప్రజల పాటల్లో అమరుడుగా  మిగిలిపోయాడు. 








చైనా కవి లి బో కవిత 


తెలుగు కవి 'గానా' అనుసృజన 



వెన్నెలలో మధుపానం 


పువ్వుల మధ్య మధుభాండం.

ఒక్కణ్నే వొంపుకుంటాను. మిత్రులెవరూ చెంత లేరు.

చషకమెత్తి చంద్రుణ్ని ఆహ్వానిస్తాను.

నా నీడతో కలిసి ముగ్గురమవుతాం.



చంద్రుడు తాగడు. 

నా నీడ నా ప్రతి కదలికనీ అనుకరిస్తుంది.

అయినా ఇప్పుడు నాకీ సాహచర్యం కావాలి.

వసంతం ముగియకముందే వేడుక చేసుకోవాలి.


నేను పాడతాను, చంద్రుడు ఊగుతాడు.

నేను నర్తిస్తాను, నా నీడ చిందులు వేస్తుంది.

నేను స్పృహలో ఉన్నంత సేపూ సంతోషాన్ని పంచుకుంటాం.

ఆపైన ఎవరి దారి వాళ్ళది.


ఎప్పటికీ మేము మానవీయబంధాలు లేని స్నేహం తో ఉంటాం.

రజతనది అంతమయ్యే చోట మళ్ళీ కలుసుకుంటాం.

-------------
    
రజతనది = పాలపుంత 


( అతి అరుదయిన  కవి గాలి నాసర రెడ్డి.  పుట్టుమచ్చ బ్లాగ్ కోసం ఈ కవితకు సంబంధించిన  
50 పైగా ఆంగ్ల అనువాదాలను పరిశీలించి   చేసిన  తెలుగు అనువాదం ఇది.)



వేస్ట్ ల్యాండ్ - 6




వేస్ట్ ల్యాండ్  - 6


చవిటిపర్ర 


టి.యస్.ఎలియట్ 


4

జల మృత్యువు 



పక్ష మయింది ఫినీషియన్ ఫ్లీబాస్ చచ్చిపోయి

సముద్రపు కొంగల మోత,ఉత్తుంగ తరంగాల ఘోష,లాభనష్టాల భాష

అన్నీ మరిచిపోయాడు

సముద్రగర్భం లో ఒక సుడిగుండం

గుసగుసలాడుతోంది అతని అస్థికలతో

లేస్తూ,పడుతూ, మునకలు వేస్తూ

వృద్ధాప్యం,యవ్వనాల దశలన్నీ దాటేస్తూ

అడుగిడాడు చివరికి సుడిగుండం లో

క్రైస్తవుడో, యూదుడో ఎవరైనా కానివ్వు

చక్రం తిప్పుతూ,గాలి వాలును గమనించే వాళ్ళారా

కాస్త ఫ్లీబాస్ కేసి చూడండి

ఒకనాడు అతడూ అందగాడు, మీలాగే నిలువెత్తయినవాడు...




Thursday 21 June 2012

వేస్ట్ ల్యాండ్ - 5


వేస్ట్ ల్యాండ్ - 5





చవిటిపర్ర 

టి.యస్. ఎలియట్ 






స్ట్రాండ్ మీంచి క్వీన్ విక్టోరియా వీధిలోకి వెళ్ళా

నగరమా ఓ నగరమా

అపుడపుడూ నేను అలా వింటూనే వుంటాను

లోయర్ టేంస్ వీధి పబ్లిక్ బార్ లోంచి వినిపించే శబ్దాల్ని

ఆహ్లాదకరమైన మేండలిన్ విషాద స్వరాల్ని

ప్లేట్ల గణగణల్ని,సాయంత్రాలు సేదదీరే జాలర్ల రణగొణ ధ్వనుల్ని 

శ్వేత,స్వర్ణ వర్ణాల్లో మేగ్నస్ మార్టీయర్ చర్చి గోడలపై

అయోనియన్ రీతిలో ఊహకందని  శ్వేత సువర్ణ నగిషీల కళాఖండాల్ని 


ఆయిల్,తారు

మారుతూన్న నీటివాలు
 
సాగుతూన్న పడవలు

విశాలమైన ఎర్రని తెరచాపలు

పడవ స్తంభం మీద 

గాలివాటుకు వంగుతూ 

వరుసలుగా వెళ్తూన్న దుంగల్ని 

గ్రీనిచ్ తీరం మీంచి 

ఐల్ ఆఫ్ డాగ్స్ దాటి 

తీసుకుపోతున్నాయి పడవలు

వియొలా లాలా లీలిల్లా 

వియొలా లాలా లీలిల్లా



పడవ సరంగులు 

ఎలిజబెత్, లెస్టర్ 

ఎరుపు బంగారు ఛాయ 

పోతపోసిన ఆల్చిప్పలాంటి పటిస్టమైన నావ

ఇరుతీరాలను తాకే చిరు అలలు 

ఎగసిపడే పొంగులు

నైరుతీ పవనాలు

నీటితో కలిసి ప్రవహించే

గంటల మోతలు

తెలతెల్లని గుమ్మటాలు

వెయలాలా లియలాలా

వల్లాలా లియల్లాలా



" ట్రాములూ ,దుమ్మూ ధూళిధూసరితమయిన చెట్లు 

జన్మ నిచ్చింది హైబరీ, నను నాశనం చేసింది రిచ్ మండ్,క్యూలు 

ఇరుకు పడవలో రిచ్ మండ్ పక్కన" 

" పడుకుని వెల్లకిలా పైకెత్తాను మోకాళ్ళు 

పాదాలు మూర్ గేట్ లో మనసేమో నా పాదాల్లో" 

' తంతు ముగిసింది ' అతను యేడ్చాడు 

' ఒక కొత్తబతుకు 'కి అభయమిచ్చాడు

" ఏమీ అనలేదు నేను. ఏమనగలను?"

" ఏ మాటమీద ఘర్షించను?

" మార్గేట్ శాండ్స్ హోటల్లో 

నేను శూన్యాన్ని శూన్యం తో జతపర్చగలను

మురికి చేతులు విరిగిన వేలిగోర్లు

ఏదీ ఆశించని సాదా సీదా జీవులు నా ప్రజలు 

లాలా 

చివరికి నేను కార్తేజ్ నగరానికి చేరుకున్నాను

మంట,మంట,కాల్చేసే మంట, కూల్చేసే మంట 

ప్రభూ నన్ను మంట నుంచి రక్షించు 

ప్రభూ నన్ను కాపాడు

మంట



( సశేషం )